50 రోజుల తర్వాత.. జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రివాల్..

Spread the love

లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. దాదాపు 50 రోజుల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ జైలు నుంచి బయటకు వచ్చారు.

సీఎం కేజ్రివాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు మంజూరు చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. దీంతో తీహార్ జైలు వద్ద కేజ్రివాల్ కు ఆప్, నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దీంతోపాటుగా ఆయన నివాసం వద్ద భారీ ఎత్తున బాణాసంచా కాల్చుతూ ఆప్ కార్యకర్తలు సందడి చేశారు.

కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రివాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓ పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన కోర్టు కేజ్రీవాల్ కు కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.

 

జైలు నుంచి బయటకు వస్తున్న తనకి స్వాగతం పలకడానికి వచ్చిన వారికి కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఆశీర్వాదాలు అందించిన ప్రజలకు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కేజ్రీవాల్ ధన్యావాదములు తెలిపారు. వాళ్ల వల్లనే తాను ప్రజల ముందుకు వచ్చానన్నారు. ప్రజలంతా కలిసి ఇకపై నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

 

కాగా, రేపు ఉదయం 11 గంటలకు కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ ఆలయంలో పూజలు చేసి ఆ తర్వాత ఢిల్లీలోని తన పార్టీ కార్యాలయానికి చేరుకుంటానని జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ వెల్లడించారు. ఆ తర్వాత అక్కడే ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. గతంలో తాను ఈడీ అరెస్ట్ నుంచి మధ్యలోనే బయటకు వస్తానని అన్నానని.. అన్నట్లుగానే తాను బయటకు వచ్చానని అన్నారు. కాగా, జూన్ 2వ తేదీన కేజ్రీవాల్ మళ్లీ జైలులో సరెండర్ కావాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *