ఢిల్లీలో హై అలర్ట్.. ఎయిర్‌పోర్ట్, 10 ఆసుపత్రులకు బాంబు బెదిరింపు..

Spread the love

సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్టుతో సహా 10 ఆస్పత్రులకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో బాంబు నిర్వీర్య స్క్వాడ్‌లు, ముందు జాగ్రత్తగా ఫైర్ ఇంజిన్లను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు.

 

ముందుగా బురారీ ఆసుపత్రికి మధ్యాహ్నం 3.15 గంటలకు బాంబు బెదిరింపు వచ్చిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. అటు బురారీ ఆసుపత్రికి బాంబు బెదిరింపు రావడంతో స్థానిక పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అక్కడకు చేరుకున్నాయని, బృందాలు ఆసుపత్రిని తనిఖీ చేస్తున్నాయని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్) MK మీనా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని ఆయన అన్నారు.

 

అటు సాయంత్రం 4.26 గంటలకు సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు తెలియడంతో అక్కడికి కూడా ప్రత్యేక బృందాలను పంపించామని ఢిల్లీ అగ్నిమాపక సేవల అధికారి తెలిపారు. వీటితో పాటు హిందూరావు హాస్పిటల్‌తో సహా మరో ఎనిమిది నుంచి 10 ఆసుపత్రులకు ఇలాంటి బెదిరింపు ఈమెయిల్‌లు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

 

ఇక సాయంత్రం 6.15 గంటలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ తెలిపారు.

 

ఇటీవలి కాలంలో ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని 130కి పైగా పాఠశాలలకు తమ ప్రాంగణంలో పేలుడు పదార్థాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఒకే రకమైన ఈమెయిల్‌లు వచ్చాయి. బెదిరింపులు విస్తృతమైన భయాందోళనలకు దారితీశాయి, దీని ఫలితంగా తక్షణ తరలింపులు, విద్యాసంస్థలపై సమగ్ర శోధనలు జరిగాయి.

 

ఈమెయిల్‌ల, ఖచ్చితమైన మూలాన్ని కనుగొనడానికి ఢిల్లీ పోలీసులు ఇంటర్‌పోల్ ద్వారా రష్యన్ మెయిలింగ్ సర్వీస్ కంపెనీ Mail.ruని సంప్రదించారు. బాంబు బెదిరింపులు బూటకమని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *