ఏపీలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్రం ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి, ఇటు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలకు సమన్లు జారీ చేసింది. వీరిద్దరూ కూడా ఢిల్లీకి వచ్చి వ్యక్తిగతంగా ఎన్నికల సంఘం ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ అందులో ఆదేశించింది.
ఈ హింసాత్మక ఘటనల విషయంలో స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వదిలేసినట్లు ఈసీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఏపీలో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్.. ఏపీలో పోలింగ్ రోజు, ఆ తరువాత నెలకొన్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన అంశాలను నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్, డీజీపీకి సమన్లు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఈ ఇద్దరు అధికారులు గురువారం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు.
అయితే, సోమవారం జరిగిన పోలింగ్ తరువాత మంగళవారం ఏపీలో తాడిపత్రి, కారంపుడి, తిరుపతిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో కారంపుడి, తిరుపతి, తాడిపత్రిలు రణరంగంగా మారాయి. అదేవిధంగా పోలింగ్ జరిగిన రోజు సోమవారం కూడా రాష్ట్రంలో పలు చోట్లా ఘటనలు చోటు చేసుకున్నాయి. అందుకు సంబంధించిన పలు వార్తా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇటు తాడిపత్రిలో కూడా హింసాత్మక ఘటనలు చెలరేగిన విషయం తెలిసిందే. హింసాత్మక ఘటనలతో తాడిపత్రి యుద్ధభూమిగా మారింది. అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించి, వారిని అదుపు చేసేందుకు ప్రయత్నం చేయగా పలువురు అధికారులకు గాయలయ్యాయి. దీంతో కేంద్ర బలగాలు భారీగా అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టిన విషయం తెలిసిందే.
వీటన్నిటిపైనా రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ ఈసీకి నివేదించగా, స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సీఎస్ కు, డీజీపీకి సమన్లు జారీ చేసి వివరణ ఇవ్వవలసిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. సీఎస్, డీజీపీ రేపు ఢిల్లీకి వెళ్లి ఈసీకి వివరణ ఇవ్వనున్నారు