నివురుగప్పిన నిప్పులా పల్నాడు, తాడిపత్రిల్లో 144 సెక్షన్..

Spread the love

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల జరిగి 48 గంటలు అయ్యింది. అయినా కొన్నిప్రాంతాలు ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. పోలింగ్ రోజు గొడవలు జరిగిన నుంచి ఇప్పటి వరకు హైటెన్షన్ వాతావరణమే నెలకొంది. చాలా ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ఏరియాల్లో అయితే రాడ్లు, చైన్లు వేట కొడవళ్లు వెంట బెట్టుకుని మరీ ప్రత్యర్థుల కోసం గాలించారు.

 

టీడీపీ-వైసీపీ నాయకుల మధ్య గొడవలు జరిగే అవకాశముందని సూచనతో పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసారావుపేట, గురజాల నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి నేతలున్నారు. అంతేకాదు ఆయా పట్టణాల్లోకి వచ్చే వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు.

 

రెండు రోజులపాటు దుకాణాలు మూసివేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమ్మికూడొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దుకాణాలు మూసివేశారు వ్యాపారులు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను అధికారులు రంగంలోకి దించారు.

 

అటు అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ 144 సెక్షన్ అమలవుతోంది. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిలను వేర్వేరు ప్రాంతాలకు తరలించారు పోలీసులు. ఇరువురు నేతల ఇళ్ల వద్ద బందోబస్తు పెంచారు. మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం పోలీసులు ప్రయోగించిన బాష్పవాయువుతో కాస్త ఇబ్బందులు పడ్డారు. చివరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కాంచన హాస్పిటల్‌కి తరలించారు బంధువులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *