సీఏఏ అమలు వేగవంతం.. 14 మందికి తొలిసారి భారత పౌరసత్వం

Spread the love

సీఏఏ అమలులోకి వచ్చిన తర్వాత కేంద్రం తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం పౌర సత్వ సవరణ చట్టం-2019 (CAA) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది.

 

ఈ నేపథ్యంలోనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఢిల్లీలో సీఏఏ క్రింద జారీ అయిన పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. దేశంలో సీఏఏ అమలు కోసం ఈ ఏడాది మార్చిలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే 2019 డిసెంబర్ లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం పార్టమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది.

 

సీఏఏ చట్టం ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర తరనార్థుల వద్ద సరైన పత్రాలు లేకపోయినా వారికి భారత పౌరసత్వం ఇచ్చేలా కేంద్రం నిబంధనలు రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్దులు, పార్సీలు, జైనులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. దీని దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్ లైన్ లోనే ముగుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *