ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ లేఖ..!

Spread the love

ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేశారు. ప్రియమైన ఏపీ ప్రజలకు నమస్కారం. ఈ నెల 13న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు. సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున భాగస్వాములైనందుకు నా అభినందనలు. 81.86 శాతం మంది ఓట్లు వేసి రాజ్యంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అధికారులు, యంత్రాంగం చేపట్టిన చర్యలను అభినందిస్తున్నా.. మీడియా, పౌర సంఘాలకు కృతజ్ఞతలు అని పవన్ లేఖలో పేర్కొన్నారు.

 

పిఠాపురం ప్రజలకు పవన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసిన తనను ప్రజలు ఎంతగానో ఆదరించారని.. వారు చూపించిన ప్రేమకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా తాను పోటీ చేస్తున్నానని తెలియగానే తనకు బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ టీడీపీ ఇంచార్జి ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ ఆయన అనుచరులు తనకు అండగా ఉన్నారని అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికల సమయంలో వర్మ అందించిన సహకారం ఎప్పటికీ మరిచిపోలేనిదని తెలిపారు. పిఠాపురం అభివృద్ధి కోసం వర్మ అనుభవాన్ని వినియోగించుకుని ముందుకు వెళతానని అన్నారు.

 

పిఠాపురంలో తాను పోటీ చేస్తున్నానని తెలియగానే సినిమాలు, సీరియల్స్ కు విరామం ఇచ్చి ప్రతీ ఇంటికి తిరిగి సినీ, సీరియల్ నటులు ప్రచారం చేశారని.. వారందరి ప్రేమ తనను కదిలించిందని తెలిపారు. తన విజయాన్ని కోరుతూ ఎంతో మంది హీరోలు, నవ తరం నటులు అందరూ మద్దతు ప్రకటించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

 

ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు అని తెలిపారు. దేశ విదేశాల నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి మాతృ భూమి అభివృద్ధి కోసం ప్రయత్నించిన ఎన్నారై జన సైనికులకు అభినందనలు తెలిపారు. పిఠాపురం మార్పుకోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానంటూ లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *