ఈసీ, డీజీపీకి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ..

Spread the love

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈసీ, డీజీపీకి లేఖ రాసారు. విశాఖపట్నం కంచర పాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో వైసీపీ నేతలు ఓ కుటుంబంపై దాడి చేసిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ రాశారు.

 

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. ఘటనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసిన వారిపై కేసులు పెట్టడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. మీడియాపై కేసులు ఎత్తివేసి, కేసులను తప్పుదారి పట్టించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై ఈసీ జోక్యం చేసుకోవడంతోనే పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు.

 

విశాఖ ఘటనలో బాధితుల గళం వినిపించిన మీడియా సిబ్బందితో పాటు బీజేపీ నేత విష్ణు కుమార్ రాజుపైన కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ప్రచారం చేయడం కూడా తప్పేనా అని అడిగారు. ప్రాథమిక హక్కులను కాలరాస్తూ మీడియాపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

 

కంచరపాలెంలో వైసీపీకి ఓటు వేయలేదన్న కారణంతో మహిళలపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేయలేదనే తమపై దాడి చేశారని బాధితులు కూడా చెబుతున్నారని గుర్తు చేశారు. బాధితులు చెప్పిన విషయాలనే మీడియా కూడా ప్రసారం చేసిందని అన్నారు. పోలీసులు మాత్రం వైసీపీ నేతలతో కలిసి దాడి ఘటనను తప్పు దోవ పట్టించే ప్రతయ్నం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

 

దాడి ఘటనను మీడియా ద్వారా తెలియజేయడం కూడా నేరమన్నట్లు పోలీసులు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.కేసులు ఉపసంహరించుకునేలా ఈసీ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విశాఖలో హింసను అదుపుచేయడంలో విఫలం అయిన అధికారులపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. మీడియా గళాన్ని నొక్కే ప్రయత్నం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *