వారణాసీలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం..

Spread the love

ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సోమవారం ఐదో విడత ఎన్నికల పోలింగ్ జరిగింది. రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీతోపాటు పలువురు పోటీ చేసిన పార్లమెంటు నియోజకవర్గాల పోలింగ్ కూడా ఈ ఐదో విడతలో జరిగాయి. అయితే, ఆరో విడతలో వారణాసీలో ఎన్నికల పోలింగ్ జరగనున్నది. వారణాసీ నుంచి ప్రధానమంత్రి మోదీ పోటీ చేస్తున్నారు.

 

ఈ క్రమంలో అందరి దృష్టి వారణాసీపై పడింది. ఈసారి వారణాసీ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది..? మోదీకి అనుకూలంగా ఉంటారా.. ? లేదా ప్రతికూలంగా ఉంటారా? అనేది దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అయితే, ప్రధాని మోదీ గెలుపు కోసం బీజేపీ అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. రాష్ట్రాల్లోని ఉన్న బీజేపీ సీనియర్ నేతలను అక్కడికి పంపించి ప్రచారం చేయిస్తుంది. ఈ క్రమంలో బండి సంజయ్ కూడా వారణాసీకి వెళ్లి అక్కడ ప్రచారం నిర్వహించారు. అక్కడ ఉన్న తెలుగు సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. మోదీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఆరో విడతలో భాగంగా వారణాసీలో ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఇక్కడ వార్ వన్ సైడే ఉంటదన్నారు. వారణాసీ ప్రజలు మోడీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వారణాసీ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వారు మోడీకే ఓటు వేస్తామని చెప్పారని ఆయన అన్నారు. అయితే, బండి సంజయ్ ప్రధాని మోదీ పోటీ చేస్తున్న పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం చేయడంపై బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

అయితే, మే 13న తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కరీంనగర్ కు వచ్చి బహిరంగ సభలో పాల్గొని బండి సంజయ్ కు మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఫలితం కూడా ఆరోజే వెల్లడికానున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *