లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు ఐదు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు విడతలు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పార్టీల నేతలు ఎన్నికల ప్రసంగాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీజేపీపై విరుచుకుపడ్డారు. పీఓకే భారత్ లో అంతర్భాగమని తాము కూడా చెబుతున్నామని అన్నారు. తిరిగి స్వాధీనం చేసుకోవాలని అందరు కోరుకుంటున్నారని వెల్లడించారు. బీజేపీ మాత్రం ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని తెరపైకి ఎందుకు తెస్తుందని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఎన్నికల సమయంలో కావాలనే పీఓకే గురించి తరుచూ మాట్లాడుతున్నారని ఆరోపించారు.
పదేళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. మొదట్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని చెప్పిన బీజేపీ మరి ఇప్పుడెందుకు చెప్పడం లేదని అన్నారు. పెట్రోల్ ధరలు రూ. 100 దాటాయని మండిపడ్డారు. మోదీ పోటీ చేస్తున్న వారణాసిలో పేపర్ లీక్ ఘటనల విషయాలను బీజేపీ మరుగున పడేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.