ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సీసీఎస్ లో పనిచేస్తోన్న ఉమామహేశ్వరరావు పై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో.. రెండ్రోజులుగా హైదరాబాద్ అశోక్ నగర్లోని ఆయన ఇంట్లో, ఏపీలో ఉన్న ఆయన సొంత ఊరిలోని స్నేహితులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.
ఆయన ఇంటిలో జరిపిన సోదాల్లో 35 లక్షల 50 వేల రూపాయల నగదు, 60 తులాల బంగారం, 17 స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఉమామహేశ్వరరావుకు రెండు లాకర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. లాకర్లను ఓపెన్ చేయాల్సి ఉంది. శామీర్ పేటలో ఖరీదైన విల్లాను కూడా గుర్తించారు. దర్యాప్తు పూర్తిగా ముగిసేసరికి ఆయన ఆస్తులు ఇంకా బయటికి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. బుధవారం కోర్టులో హాజరు పరిచారు. హైదరాబాద్ ACP ఉమామహేశ్వర్ రావుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.