ఢిల్లీ నార్త్ బ్లాక్ లో ఉన్న హోం మినిస్ట్రీ కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం సంచలనంగా మారింది. నార్త్ బ్లాక్ వద్ద బాంబు ఉందని పోలీస్ కంట్రోల్ రూమ్ కు మెయిల్ వచ్చింది. దీంతో హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో భద్రతా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు బాంబు బెదిరింపు మెయిల్ పై అధికారిక హోం మంత్రిత్వ శాఖ ప్రకటన చేయలేదు.
బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఫైర్ సర్వీస్ కు ఢిల్లీ పోలీసులు సమాచారం అందించారు. దీంతో నార్త్ బ్లాక్ కు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అంతే కాకుండా అధికారులు డాగ్ స్వ్కాడ్, డిస్పోజల్ స్వ్కాడ్ ను రంగంలోకి దింపి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.ఇటీవల స్కూల్స్, హాస్పిటల్స్ కు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపుతున్న ఆగంతకులు నేడు ఏకంగా మంత్రిత్వ శాఖనే టార్గెట్ గా చేసుకుని మెయిల్ పంపారు. మెయిల్ ఎవరు పంపించారు అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ వివిధ ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు మెయిల్స్ రావడం సంచలనంగా మారింది. స్కూళ్లు, ఎయిర్ పోర్టులు సహా పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు ఈ మెయిల్స్, ఫోన్ కాల్స్ రావడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోంశాఖకే బాంబు బెదిరింపు ఈ మెయిల్ రావడంతో ఈ అంశం తీవ్ర కలకలం రేపుతోంది.
బాంబు హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, భద్రతా బలగాలు అలర్ట్ అయ్యారు. నార్త్ బ్లాక్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాలకు బాంబు బెదిరింపులతో అలజడి సృష్టించేందుకు ఆగంతకులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన బెదిరింపులు అన్నీ బూటకమని అధికారులు తేల్చారు.