ఏపీ హైకోర్టులో పిన్నెల్లి మధ్యంతర బెయిల్ పిటిషన్..!

Spread the love

మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తుండగా.. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. ఏపీ హైకోర్టు దానిని స్వీకరించింది. కాసేపట్లో ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేయనుంది.

 

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు నిన్నటి నుంచి గాలిస్తున్నారు. ఆయన ఆచూకీ ఎక్కడా తెలియకపోవడంతో.. లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గురువారం మధ్యాహ్నం పిన్నెల్లి నరసరావుపేట జిల్లాకోర్టులో లొంగిపోతారని సమాచారం రావడంతో.. పోలీసులు ఆయన కోసం కోర్టు వద్ద పహారా కాశారు. అనూహ్యంగా పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

 

మరోవైపు మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది. నేడు టీడీపీ నేతలు ఛలో మాచర్లకు పిలుపునివ్వగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎక్కడికక్కడే టీడీపీ నేతల్ని మాచర్లకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్లలోకి బయటి వ్యక్తులు ఎవరూ వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు. టీడీపీ నేతలు అక్కడికి వెళ్తే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందన్నారు. ఎస్పీ మాలికా గార్గ్.. ఎవరైనా బయటికొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిన్నెల్లి కేసు ఒక కొలిక్కి వచ్చేంత వరకూ మాచర్లలో పరిస్థితి కంట్రోల్ అయ్యేలా కనిపించడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక ఫలితాల రోజు ఏపీలో ఎన్ని గొడవలు, అరాచకాలు జరుగుతాయోనని సమస్యాత్మక నియోజకవర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *