నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడూరు మండలంలో భారీ వర్షానికి కోళ్ల ఫారం ప్రహారీ గోడ కూలి నలుగురు మృతి చెందారు. ఆదివారం ఈ సంఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
నాగర్ కర్నూల్ జిల్లాలోని తాడూర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంద్రకల్ గ్రామ శివారులో ఉన్న కోళ్ల ఫాం ప్రహరీ గోడ భారీ వర్షం కారణంగా కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయలవగా స్థానికులు అంబులెన్స్ ద్వారా బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అయితే అదే జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగుపటుకు లక్ష్మణ్ అనే బాలుడు చనిపోయాడు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో భారీగా వీచిన ఈదురుగాలులకు వృక్షాలు నేలకొరిగాయి. వనస్థలిపురంలోని గణేష్ టెంపుల్ ప్రహరీ లోపల ఉన్న భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడడంతో పార్కింగ్ చేసిన కారు, ఆటో ధ్వంసం అయ్యాయి.
వనస్థలిపురం నుంచి ఎన్జీవోస్ కాలనీ వెళ్లే ప్రధాన రహదారిపై భారీ చెట్టు రహదారిపై విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనితో ఘటన స్థలానికి చేరుకున్న మున్సిపల్, డీఆర్ఎఫ్ టీం భారీ వృక్షాలను తొలగిస్తున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు పలు చోట్ల వర్షాలకు రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. అంతే కాకుండా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.
నారాయణపేటలో గాలి వాన బీభత్సం సృష్టించింది. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఆదివారం వారపు సంత సందర్భంగా రైతులు వ్యాపారస్తులు మార్కెట్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పలు దుకాణాలపై ఉన్న టార్పాలిన్ లు గాలి బీభత్సానికి చెల్లాచెదురుగా ఎగిరిపోయాయి.