నరసరావుపేటలో పిన్నెల్లి, హోటల్‌లో స్టే..!

Spread the love

పల్నాడులో ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? రాజకీయ ప్రత్యర్థులపై దాడులు కొనసాగుతాయా? లేక ఎన్నికల ఫలితాలు తర్వాత దాడులు కంటిన్యూ అవుతాయా? ఇవే ప్రశ్నలు అక్కడి ప్రజలను వెంటాడుతున్నాయి. దీనికి కారణంగా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడులో అడుగుపెట్టడమే.

 

తాజాగా న్యాయస్థానం నుంచి రిలీఫ్ పొందిన గంటల వ్యవధిలో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మంగళవారం రాత్రి నరసరావుపేటకు చేరుకున్నారు. రాత్రి ఓ హోటల్‌లో ఆయన బస చేశారు. రాత్రి పన్నెండు గంటల సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ మలికాగార్గ్ ఎదుట ఆయన హాజరయ్యారు. తాను ఎక్కడ ఉంటాననే వివరాలు వెల్లడించారు.

 

న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ప్రతీరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదులోపు పిన్నెల్లి ఎస్పీ ఎదుట హాజరుకావాలి. అంతేకాదు నరసరావుపేట దాటి వెళ్లకూడదని, స్థానికంగా ఎక్కడ ఉంటారో ఎస్పీకి సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో న్యాయస్థానం ప్రస్తావించింది. తన పాస్‌పోర్టును మేజిస్ట్రేట్ కోర్టులో అప్పగించాలని ఆంక్షలు విధించింది. ఒకవేళ న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే వెసులుబాటు పోలీసులకు ఇచ్చింది న్యాయస్థానం.

 

అంతేకాదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని పేర్కొంది. ప్రస్తుతమున్న కేసుల్లో బాధితుల్ని ఇబ్బందిపెట్టకుండా చూసే బాధ్యత కూడా ఆయనదేనని తెలియజేసింది. తన కేసుల గురించి మీడియాతో మాట్లాడరాని, అంతేకాదు బాధితులు, సాక్షులను కలవడానికి వీల్లేదని ఆదేశించింది.

 

మే 13న ఎన్నికల పోలింగ్ వేళ ఈవీఎం విధ్వంసం, హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపుల అభియోగాలతో నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీ ప్యాట్‌లను నేలకేసి కొట్టిన ఘటన ఈనెల 21న వెలుగుచూసింది. దీంతో ఎన్నికల సంఘం సీరియస్‌గా రియాక్టు అయ్యింది. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. పోలీసులు ఆయనను పట్టుకునేందుకు ప్రకటనలు ఇవ్వడమేగానీ, అదుపులోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *