ఢిల్లీలో ఎండల కారణంగా తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి వృథాను అరికట్టాలని ప్రభుత్వం ఢిల్లీ జల బోర్టును ఆదేశించింది.
ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ.2,000 జరిమానా విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రేపటి నుంచి నీటి వనరులను దుర్వినియోగం చేసేవారిని తనిఖీ చేయడంతో పాటు జరిమానా విధించడానికి బృందాలను మోహరించనున్నారు.
నీటి వృథా కేసులను పర్యవేక్షించడానికి, తగ్గించడానికి 200 బృందాలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ జల మంత్రి అతిషి ఢిల్లీ జల బోర్డు సీఈవోను ఆదేశించారు. ఈ బృందాలు నివాస ప్రాంతాల్లో పైపులోని నీటితో కార్లను కడగడం, నీటి ట్యాంకులు పొంగిపొర్లడం, నీటిని వాణిజ్య అవసరాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తే వారికి జరిమానా విధిస్తారు. హర్యానా ప్రభుత్వం ఈ నెలలో ఢిల్లీకి కేటాయించిన నీటి వాటా అందించడం లేదని అతిషి మంగళ వారం ఆరోపించగా నేడు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మే 1న వజీరాబాద్లో 674.5 నీటిమట్టం ఉండగా, ఇప్పుడు 669.8కి పడిపోయింది. దీంతో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడిందని ఆమె తెలిపారు. ఢిల్లీలోని ఆరు నీటి శుద్ధి ప్లాంట్లలో వజీరాబాద్లో ఒకటి ఉంది. ఢిల్లీ నీటి వృథాను అరికట్టేందుకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
ఉదయం 8 గంటల నుంచి ఈ బృందాలు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ నీటి వృథాపై దృష్టి సారిస్తాయి.
ప్రజలు సహకరించాలని, నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా లేక పోవడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నీటిని వృథా చేయకూడదని నీటిని పొదుపు చేయాలని ఆమె ప్రజలకు సూచించారు.