లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. లోక్ సభ ఎన్నికల 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనున్నది. ఇదే చివరి దశ పోలింగ్. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నది. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు కూడా బరిలో ఉన్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీ వారణాసి ఓటర్లకు వీడియో సందేశం పంపించిన విషయం తెలిసిందే.
కాగా, బీహార్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనున్నది. యూపీ, పంజాబ్ నుంచి 13 లోక్ సభ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్ నుంచి 9 లోక్ సభ నియోజకవర్గాలకు, బీహార్ నుంచి 8 లోక్ సభ నియోజకవర్గాలకు, ఒడిశా నుంచి 6 లోక్ సభ నియోజకవర్గాలకు, హిమాచల్ ప్రదేశ్ నుంచి 4 లోక్ సభ నియోజకవర్గాలకు, జార్ఖండ్ నుంచి 3 లోక్ సభ నియోజకవర్గాలకు, చండీగఢ్ నుంచి ఒక లోక్ సభ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్నది.
లోక్ సభ ఎన్నికలను మొత్తం ఏడు దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆరు దశల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇటీవలే జరిగిన 6వ దశలో 57 నియోజకవర్గాల్లో 61.98 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఐదో దశలో 49 నియోజకవర్గాల్లో 62.2 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. నాలుగో దశలో 96 నియోజకవర్గాల్లో 69.16 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మూడో దశ పోలింగ్ లో 94 నియోజకవర్గాల్లో 65.68 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో 88 నియోజకవర్గాల్లో 66.71 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇక మొదటి దశలో 102 నియోజకవర్గాల్లో 66.14 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం ఏడు దశల్లో జరిగిన పోలింగ్ కు సంబంధించిన ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఆరోజు తేలనున్నది ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రానున్నది అనేది. అయితే, ఇప్పటికే ఇటు బీజేపీ, అటు ఇండియా కూటమి తమకంటే తమకు ఎక్కువ సీట్లు వస్తాయి.. తామే కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నామంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.