తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి నగరంలోని ట్యాంక్ బండ్ పై నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. గవర్నర్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సీఎస్ తోపాటు పలువురు ప్రముఖులు, అధికారులు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసినటువంటి వివిధ స్టాళ్లను పరిశీలించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు.. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పే విధంగా కళలను ప్రదర్శించారు. అదేవిధంగా 5 వేల మంది ట్రైనీ పోలీసులతో నిర్వహించిన ఫ్లాగ్ వాక్ ఎంతగానో ఆకట్టుకుంది. వేడుకలను వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. జై తెలంగాణ నినాదాలతో ట్యాంక్ బండ్ మరోసారి మార్మోగింది.
Celebrations
Celebrations
ఇదిలా ఉంటే.. ఉదయం గన్ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆయన పేర్కొన్నారు. ప్రజా పాలన అందించి.. తెలంగాణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు.
విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరం ఇక నుంచి తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇకపై విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఎక్కవ భాగం తెలంగాణ ప్రజలకు దక్కనున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.