తెలంగాణ అవతరణ వేడుక, సీఎం రేవంత్ స్పీచ్, మాస్టర్ ప్లాన్‌లో అంశాలు..

Spread the love

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి మాస్టర్ ప్లాన్‌ను బయటపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణకు డ్రీమ్ 20-50 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజన చేస్తున్నామన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతం అర్భన్ తెలంగాణ అని, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డుప్రాంతం సబ్ అర్బన్ తెలంగాణ అని చెప్పారు.

 

రీజినల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణ అని వివరించారు. త్వరలో మూడు ప్రాంతాలకు అభివృద్ధికి ప్రణాళికలు ప్రకటిస్తామన్నారు. త్వరగా రీజినల్ రింగ్ రోడ్డును పూర్తి చేస్తామని, తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని ఇచ్చే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రయార్టీ అని చెప్పుకొచ్చారు. డ్రగ్స్, గంజాయ్ విషయంలో ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. అంతకు ముందు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించిన సీఎం రేవంత్, నేరుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లారు. అక్కడ నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

 

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సందేశం వీడియోను ప్రదర్శించా రు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన ఆమె, అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ చరిత్ర ఉన్నంతవరకు ఈ సమాజం సోనియాను తల్లిగానే గౌరవిస్తుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ గడ్డతో సోనియాగాంధీది రాజకీయ బంధం కాదని, పేగు బంధమన్నారు. సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవం రాష్ట్ర భవిష్యత్ నిర్మాణానికి కీలకమన్నారు.

 

తెలంగాణ వచ్చి పదేళ్లయినా రాష్ట్ర గీతం లేదన్నారు ముఖ్యమంత్రి. జయ జయహే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటించామన్నారు. జాతి చరిత్రకు అద్దం పట్టేదే చిహ్నమన్నారు. చరిత్ర మొత్తం నిక్షిప్తమయ్యి ఉండేదన్నారు. తెలంగాణ అంటేనే ధిక్కారం, పోరాటమని, చిహ్నంలో ఆయా అంశాలు ప్రతిబింబించాలన్నారు. సగటు గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి రూపంగా ఉండాలన్నారు. తరుగు లేకుండా ధాన్యం కొంటున్నామని, తడిసిన ధ్యానాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నట్లు తన ప్రసంగంలో చెప్పారు. ఇప్పటికే 7500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని, ప్రజల అవసరాలకు తగినట్టు మెట్రో విస్తరణ ఉంటుందన్నారు.

 

ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ ప్రజల తత్వమన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. సంక్షేమం ముసుగులో చెరబట్టాలని చూస్తే ఇక్కడి సమాజం సహించదన్నారు.తెలంగాణ ప్రజల సాకారం చేసిన పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జీవనశైలి స్వేచ్ఛ అని, బానిసత్వాన్ని భరించదన్నారు. మా పాలనలో పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామన్నారు. ముఖ్యంగా ఇందిరాపార్కులో ధర్నాలకు అనుమతి ఇచ్చామని, ప్రతపక్షానికి గౌరవం ఇచ్చామని గుర్తు చేశారు. తల్లిని ఆహ్వానించేందుకు బిడ్డకు ఒకరి అనుమతి అవసరమా? అని ప్రశ్నించారు. ఏ హోదాలో ఏ పదవిలో ఉన్నారని మహాత్మాగాంధీని జాతిపితగా గుర్తించుకున్నామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *