ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా విజయకేతనం ఎగరవేసింది. ఈ ఎన్నికల్లో కూటమి దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలను టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్ళనున్నారు. ఎన్డీఏ కీలక భేటీలో పాల్గొనేందుకు రావాల్సిందిగా నిన్న బీజేపీ పెద్దల నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు.
బుధవారం ఉదయం 11 గంటలకు చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్తారు. ఢిల్లీలో జరిగే ఎన్డీఏ మీటింగ్ లో చంద్రబాబు పాల్గొంటారు. మోడీ అధ్యక్షతన జరగబోయే ఎన్డీఏ కూటమి నేతల సమావేశానికి ఇరువురు అగ్ర నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కీలక భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు తిరిగి రాత్రి 9 గంటలకు ఉండవల్లి చేరుకుంటారు. చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళనున్నట్టు తెలిసింది.