దేశానికి ఇండియా కూటమి కొత్త విజన్ ఇచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రెస్మీట్లో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ నేతలు పార్టీలను విడదీసి సీఎంలను జైలులో పెట్టారని విమర్శించారు. మోదీ, అదానీల మధ్య ఉన్నది అవినీతి బంధం అని ఆరోపించారు.
ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈడి,సీఐడీలను సొంత ప్రయోజనాలకు బీజేపీ వాడుకుందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రతి కార్యకర్త కష్టపడ్డారని అన్నారు. ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపుకోసం పనిచేశారన్న రాహుల్ వారందరికీ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో బీజేపీతో పాటు అనేక సంస్థలతో పోరాడామని అన్నారు. మోదీ, అమిత్ షాలు పలు వ్యవస్థలను తమ గుప్పిట్లో ఉంచుకున్నారని ఆరోపించారు. గెలుపు కోసం ఇండియా కూటమి కలిసి పనిచేసిందని తెలిపారు.
కాంగ్రెస్ కార్యకర్తలకు ఖర్గే కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్ర పార్టీకి ఎంతో ఉపయోగపడిందని అన్నారు. తమతో కలిసి నడిచిన అన్ని పార్టీలకు అభినందనలు అని అన్నారు. ఐక్యమత్యంతో మంచి ఫలితాలను సాధించామని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదని ..ఇది మోదీ పరాజయం అని విమర్శించారు.