నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు మూడో రౌండ్ పూర్తయ్యింది. మొదటి రౌండ్ లో 7,670 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్ లోనూ ఆయన ఆధిక్యంలో కొనసాగారు. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్ లో ఆయనకు 34,575 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 27,573 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు వచ్చాయి. అయితే, స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఆశ్చర్యపరిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో దాదాపుగా పోటీ పడుతున్నారు. రెండో రౌండ్ లో ఆయనకు 11,018 ఓట్లు వచ్చాయి.
మూడోరౌండ్ లో కూడా తీన్మార్ మల్లన్న ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ఈ రౌండ్ పూర్తి అయ్యే సరికి ఆయనకు 1,06,304 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 87,356 ఓట్లు వచ్చాయి. ప్రేమేందర్ రెడ్డికి 34,516, స్వతంత్ర అభ్యర్థికి 27,493 ఓట్లు వచ్చాయి.
నల్లగొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్లను లెక్కిస్తున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. పోలింగ్ కేంద్రాల్లో పోలైన 3.36 లక్షల బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున మొదటగా కట్టలు కట్టారు. ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం 4 గదుల్లో 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు.
కాగా, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. అయితే, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి పోటీ చేసి గెలవడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.