ఏపీ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాల గురించి ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకోకపోవడంతోనే 2018లో తన తండ్రి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారని తెలిపారు.
62 ఏళ్లుగా అందరం కలిసి హైదరాబాద్ను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. అంతే కాకుండా విభజనకు ముందు ఏపీ ఆర్థిక రాజధానిగా ఉండేదని అన్నారు. విభజన సమయంలో హామీలిచ్చిన కేంద్రాన్ని వాటిని అమలు చేయాలని కోరామని తెలిపారు. ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్యంతో రాష్ట్రం, దేశ అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలిపారు. 2014లో ఏపీ ప్రజల మెజారిటీ అభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ట్రం రెండుగా విభజించబడిందని అన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటు చేస్తామని అన్నారు.
ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి బేషరతుగా మద్దతు ఇస్తామని అన్నారు. అందుకు బదులుగా ఏపీకి సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్రం సహకారాలను కోరుతామని అన్నారు. కేంద్రం నుంచి తమకు పూర్తి మద్దతు కావాలని అన్నారు. పార్టీ ప్రయోజనాల కన్నా.. రాష్ట్ర ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యతన ఇస్తామని చెప్పారు.