తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే 65 అధునాతన చికిత్స విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకంలో అదనంగా చేర్చుతున్నట్లు ప్రకటించింది.
ఇప్పటివరకు ఆరోగ్య శ్రీలో అందుబాటులో ఉన్న 1,375 విధానాలకు ఫ్యాకేజీ ధరలను పెంచుతున్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సేవలకు సంబంధించి రూ. 497.29 కోట్లు విడుదల చేస్తూ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శ్రీ పథకం క్రింద యోంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుపూసకు సంబంధించిన ఖరీదైన వ్యాధులకు చికిత్స, ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్య శ్రీ పథకంలోని చికిత్సల ప్యాకేజీ ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం క్రింద కొత్త చికిత్స విధానాల కోసం, ప్రస్తుతం ఉన్న పథకాల ఆర్థిక సవరణ కోసం రాష్ట్ర సచివాలయంలో భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ ప్రవేశ పెట్టారు. ఈ పథకం క్రింద 2.84 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి 10 లక్షల వరకు ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా అందుతోంది.
రాష్ట్రంలో ఉన్న 1042 హాస్పిటల్స్ ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఇందులో 1375 విధానాలకు ప్యాకేజీ ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.