విద్యుత్ కొనుగోళ్ల ఇష్యూ, కేసీఆర్‌కు నోటీస్..!

Spread the love

యాదాద్రి విద్యుత్ ప్లాంటు నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తోంది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇందులో మీ పాత్ర ఏమిటో వివరించాలని అందులో ప్రస్తావించింది. ఈనెల 15 లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ఆ నోటీసులపై స్పందించారు మాజీ సీఎం కేసీఆర్. వచ్చేనెల 30 వరకు విచారణకు హాజరుకాలేనని వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడించారు.

 

ఛత్తీస్‌గడ్ నుంచి విద్యుత్ కోనుగోళ్ల వ్యవహారంపై దర్యాప్తు తీవ్రం చేసింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్. ఇందులోభాగంగా మాజీ సీఎం కేసీఆర్ సహా 25 మందికి కమిషన్ నోటీసులు ఇచ్చింది. బీఆర్కే భవన్‌లో ఇంధన శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ కుమార్, మాజీ ట్రాన్స్ కో-జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావును కమిషన్ విచారణ చేసింది. సుమారు గంటన్నరపాటు వివిధ అంశాలపై వివరాలు కోరినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం తొలినాళ్లలో చత్తీస్‌గడ్‌తో విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల ప్రభుత్వంపై దాదాపు 1300 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడిందని ప్రభుత్వం చెబుతోంది.

 

కేంద్రం నుంచి తక్కువ ధరకు విద్యుత్ ఇస్తున్నా, ఎలాంటి టెండర్లు లేకుండా అధిక ధరకు ఛత్తీస్‌గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్. 2014 నవంబరు మూడున దీనిపై ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి . ఈ వ్యవహారంలో ఫిక్స్‌డ్, వేరియబుల్ ఛార్జీలకు సంబంధించి తీవ్ర దుమారం రేగింది. అంతేకాదు ఛత్తీస్‌గడ్ ఈఆర్సీలో కేసు నడుస్తోంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ విద్యుత్ కొనుగోళ్లపై చర్చ జరిగింది. ఈ వ్యవహారంలో ఏ విచారణకైనా సిద్ధమని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. దీంతో జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *