ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ..

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. బుధవారం విజయవాడలో జరిగిన చంద్రబాబు నాయుడు, మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం సోషల్ మీడియా(ఎక్స్)లో ఈ అంశంపై స్పందించారు.

 

‘ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. ముఖ్యమంత్రి అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడికి మరియు ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ కూడా అభినందనలు. ఏపీని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది’ అంటూ మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.

 

కాగా, విజయవాడలోని కేసరవల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, చిరాగ్ పాశ్వాన్, బండి సంజయ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రముఖ సినిమా నటులు రజినీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, నందమూరి, నారా, పవన్ కుటుంబ సభ్యులతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

 

అయితే, ముందుగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా, ఆ తరువాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.. మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారమనంతరం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రధాని మోదీ.. మంత్రివర్గ సభ్యులతో కలిసి ఫొటో దిగారు. ఆ తరువాత కొద్దిసేపు స్టేజీ మీద ఉన్న పలువురితో ఆయన సంభాషించారు.

 

కాగా, ఏపీలో ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏకంగా 164 స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇటు 175కి 175 వస్తాయని ఆశించిన వైసీపీ కేవలం 11 సీట్లతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *