ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సోషల్ మీడియా(ఎక్స్)లో సంచలన ట్వీట్ చేశారు. అందులో ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కౌరవ సభ స్థానంలో కొలువుదీరనున్న గౌరవ సభ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చుతుందని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుతూ.. తమ అభిప్రాయాలను చెప్పగలుగుతున్నారని భువనేశ్వరి అన్నారు. వైసీపీ ప్రభత్వ హయాంలో జరిగిన అన్యాయాలను ప్రజలు నిర్భయంగా ప్రస్తావిస్తూ.. తాము పడిన క్షోభపై బయటకు వచ్చి గళం విప్పుతున్నారన్నారు. మహిళలు తమ రక్షణపై, తల్లులు తమ బిడ్డల భవిష్యత్ విషయంలో ధైర్యంగా ఉన్నారన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి ఇక అన్నీ మంచిరోజులే వస్తాయంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. నిజం గెలవాలి పర్యటనలో తాను ప్రజలను దగ్గర నుంచి చూశానని, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రజలు తామే గెలిచామన్న సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ప్రజల ఆశలు మళ్లీ చిగురిస్తుండడం తనకు ఎంతగానో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. చంద్రబాబు పాలనలో అమరావతి రాజధానిగా మళ్లీ గర్వంగా నిలబడుతుందన్నారు. రాజధాని రైతుల పోరాటాలు ఫలించి వారి జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయంటూ ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు దీక్ష, పట్టుదలతో జీవనాడి పోలవరం సవాళ్లను, విధ్వంసాన్ని అధిగమించి ముందడుగు వేస్తుందని ఆమె చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ప్రాంతానికి, ప్రతి వర్గానికి మంచి చేయాలనే చంద్రబాబు సంకల్పం నేరవేరుతుందంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని భువనేశ్వరి ఆకాంక్షించారు.
అదేవిధంగా పార్టీ కార్యకర్తల గురించి ఆమె మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా కృషి చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. అయినా కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ప్రాణాలను సైతం పణంగాపెట్టి పనిచేశారని, వారందరికీ కూడా గౌరవం దక్కుతుందని భువనేశ్వరి హామీ ఇచ్చారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఫొటోలను అందులో షేర్ చేస్తూ పై విధంగా పేర్కొన్నారు.