ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ..!

Spread the love

తెలంగాణ కేబినెట్ మరోసారి భేటీ కానున్నది. ఈ నెల 21న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానున్నది. మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పథకాలకు సంబంధించి నిధుల సమీకరణ, రుణమాఫీ, రైతుభరోసా విధివిధానాలపై చర్చించనున్నారు.

 

ఆగస్టు 15 లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు రూ. 30 వేల కోట్లు, రైతు భరోసాకు మరో రూ. 7 వేల కోట్లు అవసరమవడంతో నిధుల సేకరణ ఎలా చేయాలనే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

 

అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, పవర్ కమిషన్ల విచారణ కాలం పెంపుపై నిర్ణయం తీసుకునే అంశంతోపాటు విభజన అంశాల్లోని 9, 10 షెడ్యూల్ కు సంబంధించిన ఆస్తులపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ భేటీలో రైతు భరోసా, రైతు రుణమాఫీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

 

ఇది ఇలా ఉంటే.. వ్యవసాయ రంగానికే రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందంటూ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పేర్కొన్న విషయం తెలిసిందే. 41వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అప్పు తీసుకోవడం అభివృద్ధిలో భాగమని భట్టి పేర్కొన్నారు. వ్యాపార రంగం అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర అని అన్నారు. వ్యవసాయం, స్థిరాస్తి, ఫార్మా రంగాలకు త్వరితగతిన రుణాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *