సభకు రాకూడదని జగన్ నిర్ణయం..!

Spread the love

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఆయన స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభకు రాకూడదని వైసీపీ నిర్ణయించింది. స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని మాజీ సీఎం వైఎస్ జగన్ భావించినట్టు తెలుస్తోంది.

 

నూతనంగా ఎన్నికైన స్పీకర్ ను అధికార, విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఎప్పట్నుంచో వస్తున్నటువంటి ఈ ఆనవాయితీకి జగన్ తిలోదకాలిచ్చినట్లు కానున్నది. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి పులివెందుల వెళ్లనున్నారు. మూడురోజులపాటు జగన్ అక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటారని వైసీపీ వర్గాలు వెల్లడించారు.

 

అయితే, గత వైసీపీ ప్రభుత్వంపై అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో మండిపడేవారు. ఆ ప్రభుత్వం చేస్తున్న తప్పులను, నాయకుల తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చేవారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ ప్రతి విమర్శలు చేసేవారు. అంతేకాదు.. ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే జగన్.. ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారేమో అంటూ చర్చ జరగుతుంది.

 

కాగా, ఏపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించి రికార్డు సృష్టించాలనుకున్న వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యింది. కూటమి భారీ విజయం సాధించింది. కూటమిలోని జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొందింది. బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. మిగతా సీట్లలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్ర ముఖ్యంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. సచివాలయంలో పదవీ బాధ్యతలు కూడా స్వీకరించారు. మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *