సీఎస్ నీరభ్ కుమార్ పదవీకాలం పొడిగింపు..!

Spread the love

ఏపీ చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్రప్రభుత్వం పొడిగించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు నీరభ్ కుమార్. ఆయన పదవీకాలం ఈనెలాఖరుతో ముగియనుండటంతో.. పదవీకాలాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఏపీ గవర్నమెంట్ విజ్ఞప్తి మేరకు.. సీఎస్ గా నీరభ్ కుమార్ పదవీకాలాన్ని పొడిగిస్తూ.. డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.

 

జూన్ 16న ఏపీ ప్రభుత్వం నీరభ్ కుమార్ పదవీకాలాన్ని పెంచాలని విజ్ఞప్తి చేస్తూ.. కేంద్రానికి లేఖ రాసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్ 16(1) ప్రకారం.. 1987వ బ్యాచ్ కు చెందిన ఆయన పదవీకాలాన్ని 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. సీఎస్ జవహర్ రెడ్డిని సెలవుపై పంపింది. ఆయన స్థానంలో నీరభ్ కుమార్ ను నియమించారు. గతంలో ఆయన భూ పరిపాలన కమిషనర్ గా పనిచేశారు. ఏపీకి సీఎస్ గా రాకముందు వరకూ రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు.

 

కాగా.. గత ప్రభుత్వంలో నిబంధనలు ఉల్లంఘించిన కొందరు ఐఏఎస్ అధికారులపై వేటు పడింది. మరోవైపు కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్న ఏపీ కేడర్ అధికారుల్ని తిరిగి రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరగా.. ఐఏఎస్ పీయూష్ కుమార్ ను పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగంలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన రాష్ట్రానికి వస్తే ఏ శాఖకు నియమిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *