మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు కీలక అంశాలను వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణతోపాటు పలువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు – చేర్పులు ఉంటాయని పేర్కొన్నారు. కొత్తగా ఐదారుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉండనున్నట్లు ఆయన తెలిపారు.
మంత్రి సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని దామోదర చెప్పారు. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, దానం నాగేందర్ కు కూడా మంత్రి పదవులు దక్కే అవకాశం లేకపోలేదంటూ దామోదర వ్యాఖ్యానించారు. నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశముందన్నారు. అదేవిధంగా త్వరలోనే వైద్యశాఖలో ప్రక్షాళన చేపడుతామని మంత్రి రాజనరసింహ తెలిపారు.
మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియామకమయ్యారు. మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారుగా ఆయన వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో ఈ బృందం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు సోలార్ తప్పనిసరి అన్నారు. అవుటర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు.