ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో వేగం పెంచారు. జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల కళ్లకు కట్టేలా చేయడంతో పాటు.. రాష్ట్రాన్ని పురొగమన బాట పట్టించడంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నేడు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అమరావతి విధ్వంసం, తాజా పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలు శ్వేతపత్రంలో ఉండనున్నాయి. కీలకమైన శాఖలు, ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో ఇది రెండోది. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే మొదటి శ్వేతపత్రం విడుదల చేసింది.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధానిలో విస్తృతంగా పర్యటించారు. రాజధాని పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అందుకు సంబంధించి అధికారులతో సీఎం సమీక్ష చేశారు. శ్వేతపత్రంలో పొందుపరచాల్సిన అంశాలపై కొన్ని సూచనలు చేశారు. మూడు భాగాలుగా ఈ శ్వేతపత్రం రూపొందిస్తున్నారు. 2014 నుండి 2019 వరకూ ఏం చేశారు? 2019 నుండి 2024 వరకూ ఏం జరిగింది? 2024 నుండి చేయాల్సిందేమిటి? అన్న అంశాలు ఉండనున్నాయి.
మొదటి భాగంలో 2014లో రాజధాని ప్రకటన చేసినప్పటి నుండి.. పూలింగు, రైతుల సహాయ సహకారాలు, అనంతరం ప్రపంచ వ్యాప్తంగా అమరావతి బ్రాండింగ్, నిధుల సమీకరణ, భవనాల ప్లాను వంటి అంశాలు ఉండనున్నాయి. వీటితో పాటు ప్రభుత్వ సిబ్బంది.. ఉన్నతాధికారులకు ఇళ్ల నిర్మాణం, ఎమ్మెల్యే క్వార్టర్స్, హైకోర్టు, ఇంటీరియమ్ గవర్నమెంటు కాంప్లెక్స్ నిర్మాణం అంశాలు కూడా ఉండనున్నాయి.
2019లో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రస్తావించనున్నారు. ముఖ్యంగా 9వేల కోట్ల వ్యయంతో చేపట్టిన అనేక పనులను నిలిపేయడంవల్ల రాష్ట్రానికి కలిగిన నష్టాన్ని తెలిపే ప్రయత్నం చేయనున్నారు. రాజధాని మాస్టర్ ప్లానును ఇష్టారాజ్యంగా మార్చడం వల్ల ఎదురైన ఇబ్బందులు ప్రజలకు తెలపనున్నారు. మూడో భాగంలో విశ్వనగరంగా అమరావతిని మార్చడం కోసం ఏం చేయాలనే అంశాలు తెలపనున్నారు.
గతంలో రూపొందించిన ప్లాన్ అమలుకు 43వేల కోట్లు ఖర్చవుతుందని, దీనికోసం నిధుల సమీకరణ ఎలా చేయబోతున్నారో శ్వేతపత్రం ద్వారా వివరించనున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాలను వినియోగంలోకి తీసుకురావడం, రోడ్డు కనెక్టివిటీ చేపట్టడం, అమరావతికి బ్రాండింగ్ చేయడం తదితర అంశాలను కూడా మూడో భాగంలో పొందుపరచనున్నారు.