రేవంత్ కేబినెట్ విస్తరణ వాయిదా..!

Spread the love

తెలంగాణలో రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ ఎందుకు వాయిదా పడింది? నేతల మధ్య చర్చలు కొలిక్కి రాలేదా? వున్నట్లుండి మంత్రివర్గం విస్తరణ వాయిదా వెనుక ఏం జరిగింది? చివరి నిమిషంలో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేంటి? కీలక నేతలు సైతం మంత్రి వర్గం విస్తరణ ఉండడం ఖాయమని చెప్పారు. మంత్రులు ఇప్పుడు నిర్వహిస్తున్న శాఖలు మారుతున్నా యని హింట్ కూడా ఇచ్చేశారు. దీంతో గడిచిన వారంరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అధికార పార్టీలో ఇదే చర్చ.

 

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం కాంగ్రెస్ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. మంత్రివర్గం విస్తరణ చివరి నిమిషంలో వాయిదా పడింది. విస్తరణ వాయిదా పడడంతో ముఖ్యమంత్రి ఏయే విషయాలపై అధిష్టానంతో మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది. కావాలనే మంత్రివర్గ విస్తరణ వాయిదా వేశారని అంటున్నవాళ్లూ లేకపోలేదు.

 

ఈనెల చివరలో కేంద్ర బడ్జెట్ ఉండబోతోంది. ఈ సమయంలో కేబినెట్ విస్తరణ చేయడం కరెక్టుకాదని ఢిల్లీ పెద్దల సూచన మేరకు వాయిదా వేసినట్టు అంతర్గత సమాచారం. ఇదే విషయమై హైకమాండ్‌తో ముఖ్యమంత్రి చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కేబినెట్ విస్తరణ చేయకుండా పెండింగ్‌లో పెట్టడం ఉత్తమమని హైకమాండ్ భావించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై రేవంత్‌రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టనుంది. కేంద్ర బడ్జెట్ తర్వాతే తెలంగాణ బడ్జెట్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అన్నిశాఖల నుంచి కీలక సమాచారాన్ని తీసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆశలు ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బడ్జెట్ ఉండబోతోందని అంటున్నారు. ప్రస్తుతం పరిపాలనపై ఆయన దృష్టి కేంద్రీకరించనున్నారు.

 

ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం సచివాలయంలో 29 శాఖలకు చెందిన ఉన్నతాధికారులపై సమీక్ష ఏర్పాటు చేశారు. అధికారుల నుంచి సమాచారం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్, శాఖల పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచనలు చేశారు. ఉన్నతాధికారులు తమ శాఖలపై పట్టు సాధించాలని స్పష్టం చేశారు. కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని పేర్కొన్నారు. మొత్తానికి పాలనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *