ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల…

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం.. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్ పై ఆయన తొలి సంతకం చేశారు. స్థానిక సంస్థలకు మొత్తం రూ. 250 కోట్ల మేర నిధులను మంత్రి విడుదల చేశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఇస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి పయ్యావుల తొలి సంతకం చేశారు.

 

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచేసిందన్నారు. వ్యాపారాలు చేసుకోలేనంత స్థాయిలో గత ప్రభుత్వం పన్నులు పెంచడంతో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నదన్నవారు. పన్నులు తక్కువగా ఉన్నాయని పొరుగు రాష్ట్రాల్లో వాహనాలు కొంటున్నారని.. పెట్రోల్ కొట్టించుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు.

 

చివరకు ఆర్టీసీకి కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి డీజిల్ కొట్టించిన పరిస్థితి ఏర్పడిందంటూ మంత్రి మండిపడ్డారు. ఒక్క ఫార్చూనర్ కారు పక్క రాష్ట్రాల్లో కొనడం వల్ల ఏపీ రూ. 16 లక్షల వరకు ఆదాయం కోల్పోతుందన్నారు. పన్నులు పెంచడం ద్వారా రాబడి పెంచుకోవాలనే జగన్ ఆలోచనా విధానం వల్ల రాష్ట్రంలో వ్యాపారాలే లేకుండా పోయాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఏపీ ఆర్థిక వ్యవస్థను జగన్ ధ్వంసం చేశారంటూ పయ్యావుల ఫైరయ్యారు. ఏపీ ఎకానమీని జగన్ పూర్తి కుప్పకూల్చారంటూ సీరియస్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల మరికొన్నాళ్లు అప్పులు చేయక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి టీమ్ చంద్రబాబు కృషి చేస్తుందని తెలిపారు. ఆదాయాలు పెరగాలంటే పన్నులు పెంచడమే మార్గం కాదు.. పన్నుల విస్తృతిని పెంచాలంటూ మంత్రి సూచించారు.

 

ఇష్టానుసారంగా పార్టిషన్ రిజిస్ట్రేషన్ ఫీజు పెంచేశారని, దీని వల్ల తెల్లకాగితాల మీద పంపకాలు చేసుకుంటున్నారని మంత్రి అన్నారు. ఫలితంగా భవిష్యత్తులో తలెత్తే వివాదాలకు జగన్ మోహన్ రెడ్డి కారణమయ్యారంటూ ఆయన దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *