కేంద్రం కీలక నిర్ణయం.. రాజ్యాంగ హత్యాదినంగా జూన్ 25..

Spread the love

దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25ను రాజ్యాంగ హత్యాదినంగా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన గెజిట్ ను శుక్రవారం విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా ప్రకటించారు.

 

1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇంధిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడం ద్వారా తన నియంతృత్వ ధోరణిని ప్రదర్శించటమే కాకుండా ప్రజాస్వామ్య ఆత్మను ఉరితీశారని అమిత్ షా ఆరోపించారు. ఏ తప్పూ చేయకపోయినా లక్షలాది మందిని జైలుకి పంపించారని అంతే కాకుండా మీడియాపై కూడా ఆంక్షలు విధించారని ఆరోపించారు. అందుకే ప్రతి ఏడాది జూన్ 25న సంవిధాన్ హత్యా దినంగా జరపాలని మోదీ సర్కార్ నిర్ణియించినట్లు తెలిపారు.

 

మరోవైపు ఎమర్జెన్సీ విధించిన రోజు రాజ్యాంగ హత్యా దినంగా నిర్వహించాలని బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఇది కేవలం హెడ్‌లైన్స్‌లో నిలవడానికి మోదీ చేసిన ఎత్తుగడ అంటూ అభిప్రాయపడింది. పదేళ్లుగా ప్రకటిత ఎమర్జెన్సీ విధించిన ప్రధాని మోదీని జూన్ 4న నైతికంగా ప్రజలు ఓడించారని ఆరోపించింది. ఆ రోజు మోదీ ముక్త్ దివాస్‌గా చరిత్రలో నిలిచిపోతుందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. బీజేపీ తీసుకున్న నిర్ణయం దేశ రాజ్యాంగం, విలువలు, సంప్రదాయం సంస్థలపై క్రమబద్ధంగా చేస్తున్న దాడి అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆరోపించారు.

 

1975 జూన్ 25వ తేదీన దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అర్ధరాత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్ బరేలీ నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హై కోర్ట్ తీర్పు ఇవ్వగా షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీం కోర్టు వెలువరించిన కొద్దిసేపటికే ఇందిరా గాంధీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 

కేంద్ర నిర్ణయం గురించి మోదీ స్పందించారు. అప్పటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాధించిందో ఈ సంవిధాన్ హత్యాదివాస్ గుర్తు చేస్తుందని అన్నారు. దేశ చరిత్రలో కాంగ్రెస్ రాసిన చీకటి దశ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ స్మరించుకునే రోజుగా జూన్ 25 ఉంటుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *