అంగన్ వాడీలకు ప్లే స్కూల్..?

Spread the love

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యావ్యవస్థకు సంబంధించి ఆయన మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో అంగన్ వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చేందుకు పరిశీలిస్తున్నామన్నారు. మూడో తరగతి వరకు కూడా అందులోనే విద్యనందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. సెక్రెటరియేట్ లో నేడు విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు సంబంధించి ఈ భేటీలో చర్చించారు.

 

ప్రభుత్వ పాఠశాలలోని పలు సమస్యలు, విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించినట్లు ఆయన చెప్పారు. ప్రతీ అంగన్ వాడీలో విద్యాబోధనకు ఒక టీచర్ ను నియమించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు. మూడో తరగతి వరకు అందులోనే విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదివే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అదేవిధంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లేందుకు కూడా విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు.

 

రెసిడెన్షియల్ స్కూల్స్ తో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ను కొనేస్తామన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చినట్లు ఆయన చెప్పారు. దశలవారీగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కార్యాచరణను తయారుచేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలకు డెవలప్ మెంట్ గ్రాంట్స్ కేటాయించాలంటూ విద్యావేత్తలు కోరడంతో.. విద్య, వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే కమిషన్లను వేయనున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *