కానీ జీవన్ రెడ్డి ప్రతిష్టకు మాది భరోసా, టిపీసీసీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు.

Spread the love

రాష్ట్రంలో ఎమ్మెల్యేల చేరికలకు తమ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని చెప్పారు. ఇక జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రతిష్ఠకు ఎక్కడా భంగం వాటిల్లకుండా చూసుకుంటామని స్ఫష్టం చేశారు. జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్యపై పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడామని పేర్కొన్నారు.

 

ఘటనపై విచారణ జరుగుతోందని, అన్ని విషయాలు త్వరలోనే వెల్లడవుతాయన్నారు. ఈ మేరకు ఘటన జరిగిన వెంటనే తాను జీవన్‌రెడ్డితో మాట్లాడానని, ఆయన ఆవేదనతో మాట్లాడుతున్నారని మహేష్‌ గౌడ్ వివరించారు. మరోవైపు కొత్తగా వచ్చిన నాయకులు, పాత నాయకులతో కలిసిపోవాలని ఆయన సూచించారు. ఈ సమస్య ఒక్క జగిత్యాలలోనే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో ఎదురవుతోందన్నారు. వీటిని తొందర్లోనే చక్కదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.

 

జగిత్యాల సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి వ్యవహారంపై మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం(అక్టోబర్‌ 23) స్పందించారు. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి మర్డర్‌పై సీరియస్‌గా ఉన్నామన్నారు. మర్డర్ ఎవరు చేసినా ఎవరు చేయించినా వదిలేది లేదన్నారు. జిల్లా ఎస్పీతో ఈ విషయమై ఇప్పటికే మాట్లాడామన్నారు.

 

ఇక జీవన్ రెడ్డితో తాను కూడా మాట్లాడుతానని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే జీవన్‌రెడ్డి అత్యంత సీనియర్ నేత అని గుర్తు చేశారు. ఆయన సేవలను తాము వినియోగించుకుంటామన్నారు. పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించమని హామీ ఇచ్చారు.

 

గంగారెడ్డి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామన్నారు. పార్టీ నేతలతో సమన్యాయం చేసుకుంటూ సమస్యలు పరిష్కరించాలని పీసీసీ చీఫ్‌ సూచించారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *