కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

Spread the love

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు లీగల్ నోటీసులు ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ అందులో పేర్కొన్నారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

 

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్. డ్రగ్స్ తీసుకుంటానని తనపై బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు కేటీఆర్. దీనిపై వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే చట్టబద్ధంగా చర్యలు తప్పవని హెచ్చరించారు మాజీ మంత్రి.

 

ఈనెల 19న తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. దానికి సంఘీభావం చెప్పేందుకు వారి వద్దకు మంత్రి బండి సంజయ్ వెళ్లారు. అభ్యర్థుల నిరసనను తనవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు.

 

గ్రూప్-1 అభ్యర్థుల తరపు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. పరీక్షల విషయం బండి సంజయ్‌కి ఏం తెలుసని ప్రశ్నించారు కేటీఆర్. గతంలో ఎగ్జామ్ పేపర్ లీక్ చేసిన వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు.

 

ఈ క్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. తాను పేపర్ లీక్ చేసినట్టు కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయిస్తారా అంటూ సవాల్ విసిరారు. తప్పుడు రాజకీయాలు చేస్తే ప్రజలు రోడ్ల మీద ఉరికించి కొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

వ్యక్తిగతంగా తనపై మాట్లాడతావా అంటూ రుసరుస లాడారు కేంద్ర మంత్రి. కేటీఆర్ భాష, అహంకారం వల్లే.. మీ నాన్న రెస్ట్ తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. డ్రగ్స్, పేపర్ లీక్‌పై మీ కుటుంబసభ్యులు ప్రమాణం చేస్తే.. తాను సెల్యూట్ చేస్తానని అన్నారు. తన జోలికి వస్తే చీకటి బండారం బయటపెడతానంటూ మండిపడ్డారు సదరు కేంద్రమంత్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *