ఏపీలో ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు..!

Spread the love

ఏపీలో ఆరోగ్య శ్రీ అమల్లో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం భీమా సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదన లు సిద్దం అయ్యాయి. సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా వీటికి ఆమోదం తెలిపారు. మరింత లోతుగా అధ్యయనం చేసిన తరువాత అధికారికంగా ఆమోద ముద్ర లభించనుంది. 2.50 లక్షల వరకు భీమా కంపెనీలు..ఆ పైన భారం ఎన్టీఆర్ ట్రస్టు భరించనున్నాయి.

 

హైబ్రిడ్ విధానం

ప్రస్తుతం అమలవుతున్న ఆరోగ్య శ్రీ స్థానంలో హైబ్రిడ్ ఆరోగ్య సేవలు అందించేలా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భీమా కంపెనీలతో ఆరోగ్య శాఖ అధికారులు చర్చలు జరిపారు. రాష్ట్రంలో హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య సేవలు అందిస్తే బాగుంటుందని ముఖ్యమంత్రికి వివరించారు. సీఎం సైతం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో 1.43 కోట్ల తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీరంతా ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు ద్వారా వైద్యం పొందుతున్నారు. వీరు కాకుండా ఉద్యోగులు, పెన్షన్లర్లు, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న (ఏపీఎల్‌) ప్రజలు కలిపి 8.13 లక్షల మంది ఉన్నారు. 1.60 కోట్ల కుటుంబాలకు రూ.25 లక్షల బీమాను కచ్చితంగా అమలు చేయాలంటే ఆర్థికంగా చాలా బారం పడుతుంది.

ప్రతిపాదనలు

ఆరోగ్య శాఖ తాజా ప్రతిపాదనల మేరకు 1.60 కోట్ల కుటుంబాలకు రూ.2.50 లక్షల ఖర్చు వరకూ ప్రభుత్వమే బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తుంది. ఖర్చు రూ.2.50 లక్షలు దాటితే రూ.25 లక్షల వరకూ ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు ద్వారా వైద్యం అందిస్తుంది. అంటే ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రతి కుటుంబానికీ ఇన్సూరెన్స్‌ కార్డు ఇస్తుంది. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు కార్డును కూడా వారు కలిగి ఉంటారు. దీనివల్ల ప్రజలందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఉండడంతో పాటు ప్రభుత్వంపై ఆర్థికంగా భారం కూడా తగ్గుతుంది. ఆరోగ్య బీమా నిమిత్తం సర్కారు ఏడాదికి రూ.2,500 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది. ప్రస్తుతం ట్రస్టు ద్వారా ఇంతే మొత్తాన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఖర్చు చేస్తోంది.

 

ఆరోగ్య భీమా

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కు ఈహెచ్‌ఎస్‌ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తున్నా వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 5.14 లక్షల మంది ఉద్యోగులు, 2.99 లక్షల మంది పెన్షన్లర్లు ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తారు. ప్రభుత్వం వీరికి కూడా బీమా కార్డులు అందిస్తుంది. వైద్యం సమయంలో వీరికి ప్రాధాన్యత ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏపీఎల్‌ కుటుంబాల వరకూ ప్రభుత్వం చెల్లించే ప్రీమియంను కొంత పెంచాలని నిర్ణయించారు. వారు కూడా నేరుగా కొంత మొత్తాన్ని బీమా సంస్థలకు చెల్లించే విధంగా ఆలోచన చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *