జమ్మూకశ్మీర్లో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1 వరకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. జమ్మూకశ్మీర్లో మొత్తం 90 స్థానాలకు గానూ 44మందితో కూడిన లిస్ట్ను బీజేపీ రిలీజ్ చేసింది. తొలి విడతలో 15 మంది, రెండో విడత కోసం 10 మంది, మూడో దశకు 19 మంది అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. మిగతా స్థానాలకు సైతం అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
అయితే, ఈసారి బీజేపీ అధిష్టానం ముస్లిం అభ్యర్థులకు ఎక్కువ సీట్లు కేటాయించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కీలక నియోజవర్గాలకు ముస్లిం అభ్యర్థులను పోటీలో నిలబెట్టింది. ఈ ఎన్నికలపై ప్రధాని మోదీ తోపాటు అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ ఏ పార్టీతోనే పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయనుంది. మొత్తం 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక, పోటీ చేయని స్థానాల్లో బలమైన స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇవ్వనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
2019లో ఆర్టికల్ 370 రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర హోదా కోల్పోయి జమ్మూకశ్మీర్ ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అంతకుముందు 2014లో ఐదు దశల్లో ఎన్నికలు జరిగాయి.
మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశలో 26 స్థానాలకు, మూడో దశలో 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతాయి. సెప్టెంబర్ 18న తొలి విడత, సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇక, అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు.
జాబితా వెనక్కి..
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన తొలి జాబితాను బీజేపీ వెనక్కి తీసుకుంది. 44 మందితో కూడిన జాబితాను ప్రకటించగా.. అందులో ముగ్గురు ముఖ్యనేతల పేర్లు కనిపించలేదు. బీజేపీ జమ్మూకశ్మీర్ ప్రెసిడెంట్ రవీందర్ రైనా, మాజీ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్, సీనియర్ నేత కవిందర్ గుప్తా పేర్లు అదృశ్యమయ్యాయి. దీంతో ఆ ముగ్గురి పేర్లను చేరుస్తూ కొత్త జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం.