బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే..

Spread the love

కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే ప్రారంభం కానున్న తరుణంలో సర్వం సిద్దం చేశారు. ఈ క్రమంలోనే బీసీ జనాభా గణాంకాల సేకరణకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం ఉత్తర్వుల విడుదల చేసింది. బీసీ కులగణనకు డేడికేటెడ్ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వర్ రావును నియమించారు. నెలరోజుల్లో కమిటీ రిపోర్టు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను శాస్త్రీయమైన పద్ధతిలో తేల్చాలని హైకోర్టు సూచించింది. దీని కోసం 2 వారాల్లో డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించాలని అక్టోబర్ 30న ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వారం రోజుల్లోనే ఈ కమిషన్ ను నియమించింది.

 

డిసెంబర్ 9లోగా బీసీ కులగణన పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. బీసీ వర్గాల్లోని కులాలు, వాటి ఉపకులాల లెక్క తేల్చబోతున్నారు. వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతుల వివరాలను సైతం సేకరించనున్నారు. మొత్తం 60 రోజుల్లో ప్రక్రియ పూర్తి కానున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కులగణనకు అవసరమైన ప్రొఫార్మాను బీసీ కమిషన్‌ ఇప్పటికే తయారు చేసింది. దాదాపు 54 నుంచి 64 ప్రశ్నలతో ప్రశ్నావళిని సిద్ధం చేసినట్టు సమాచారం.

 

రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో బీసీ గణన చేపట్టి పూర్తి వివరాలను సేకరించనున్నారు అధికారులు. ఈప్రక్రియ త్వరగా పూర్తి చేస్తామంటున్నారు. ఇందుకు దాదాపు 80 వేల మంది ఎన్యుమరేటర్లు, 10 వేల మంది సూపర్ వైజర్లు అవసరమవుతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సిబ్బందికి హైదరాబాద్‌లో మాస్టర్ ట్రైనింగ్ పూర్తి అయ్యింది. ఈ శిక్షణ తీసుకున్న వారంతా జిల్లాల్లో ఇతర సిబ్బందికి అవగాహన కల్పిస్తారు. కులగణన పూర్తి చేసి..ఆ వివరాలను కంప్యూటర్‌లో పొందపరుస్తారు. ఏ రోజు వివరాలను ఆ రోజే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. జిల్లాల కలెక్టర్లు బాధ్యతలను పర్యవేక్షిస్తారు. మొత్తం వివరాలను బీసీ కమిషన్‌ పరిశీలించి.. వాటిని క్రోడీకరించి స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లను సూచిస్తూ ప్రభుత్వానికి రిపోర్టును సమర్పించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *