జార్ఖండ్ లో హోరాహోరీ-వారిదే ఎడ్జ్ అంటున్న లోక్ పోల్..!

Spread the love

జార్ఖండ్ అసెంబ్లీకి ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. 81 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఆధిక్యం కోసం ఇండియా కూటమితో ఎన్డీయే కూటమి హోరాహోరీ తలపడుతోంది. చిన్న రాష్ట్రం కావడం, కుల సమీకరణాలు కూడా ఎక్కువగానే ఉండటంతో ఇక్కడ ప్రతీ అసెంబ్లీ సీటు గెల్చుకోవడం ప్రధాన పక్షాలకు చాలా కీలకంగా మారింది. దీంతో జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఇక్కడ చెమటోడుస్తున్నాయి.

 

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండు విడతలుగా జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే దానిపై పలు సర్వేలు వెలువడుతున్నాయి. వీటిలో దాదాపుగా ఇక్కడ హోరాహోరీ తప్పదని తేలిపోతోంది. అదే సమయంలో ఎవరికి ఎడ్జ్ ఉందన్న దానిపై సర్వే సంస్థలు తమ అంచనాలను వెలువరిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ సర్వే సంస్థ లోక్ పోల్ కూడా తాము జార్ఖండ్ లో తాజాగా చేపట్టిన సర్వే ఫలితాలను వెల్లడించింది.

 

ఇందులో రాష్ట్రంలోని 81 అసెంబ్లీ సీట్లలో అత్యధిక సీట్లను ఇండియా కూటమే కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు లోక్ పోల్ తేల్చింది. ఇండియా కూటమికి 41 నుంచి 44 సీట్లు వచ్చే అవకాశం ఉందని తాజా సర్వే రిపోర్ట్ లో వెల్లడించింది. అలాగే ఎన్డీయే కూటమికి 36 నుంచి 39 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 3 నుంచి 4 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చింది.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 42 సీట్లు అవసరం.

 

అలాగే ఇండియా కూటమికి 39 నుంచి 41 శాతం ఓట్లు వస్తాయని లోక్ పోల్ అంచనా వేసింది. అటు ఎన్డీయే కూటమికి 38 నుంచి 40 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఇతరులకు 18 నుంచి 20 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 500 శాంపిల్స్ చొప్పున మొత్తం 40500 శాంపిల్స్ సేకరించి ఈ సర్వే చేసినట్లు తాజాగా లోక్ పోల్ ట్వీట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *