ఆపరేషన్ సిందూర్… మరో వీడియో విడుదల చేసిన భారత సైన్యం..

Spread the love

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక వీడియోను భారత సైన్యం తాజాగా విడుదల చేసింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలను మన సైనిక దళాలు ఎలా ధ్వంసం చేశాయో ఈ వీడియోలో స్పష్టంగా చూపించారు.

 

వివరాల్లోకి వెళితే, మే 7వ తేదీన భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట మెరుపు దాడులు నిర్వహించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకార చర్యగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో, పాకిస్థాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని వాటిని పూర్తిగా నేలమట్టం చేసినట్లు సైన్యం పేర్కొంది. ఈ దాడులకు సంబంధించిన కీలక దృశ్యాలను ఇప్పుడు వీడియో రూపంలో ప్రజల ముందు ఉంచింది.

 

సైన్యం విడుదల చేసిన ఈ వీడియోలో ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన అనేక కీలక అంశాలను పొందుపరిచారు. పహల్గాం దాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం, సైన్యం తీసుకున్న తక్షణ చర్యలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాల వివరాలు ఇందులో ఉన్నాయి. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తున్న దృశ్యాలు, ఆపరేషన్ విజయవంతమైన తీరును కళ్లకు కట్టినట్లు చూపించారు.

 

అంతేకాకుండా, ఈ ఆపరేషన్‌కు ప్రపంచ దేశాల నుంచి భారత్‌కు లభించిన మద్దతు, భారత సైన్యం పరాక్రమాన్ని ప్రశంసిస్తూ దేశ ప్రజలు సైనికులకు సంఘీభావంగా నిర్వహించిన ప్రదర్శనలు, మీడియాలో వచ్చిన కథనాలు, ప్రముఖుల ట్వీట్లు, పాకిస్థాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ చేసిన సామాజిక మాధ్యమ పోస్టుల వంటి సమగ్ర సమాచారాన్ని ఈ వీడియోలో పొందుపరిచారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా శత్రు మూకలకు గట్టి గుణపాఠం చెప్పినట్లు సైనిక వర్గాలు ఈ వీడియో ద్వారా స్పష్టం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *