డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక.. దాడులపై ఇజ్రాయెల్ ప్రకటన..!

Spread the love

ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తమ దేశంపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ప్రతిగా తాము ఇరాన్‌లోని రాడార్ వ్యవస్థలపై దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ధృవీకరించింది.

 

ట్రంప్ జోక్యం తర్వాత తగ్గిన దాడులు

 

ఈ పరిణామాలపై నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. “కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇరాన్ మా దేశంపై మూడు వేర్వేరు ప్రాంతాల్లో క్షిపణులతో దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా మేము అక్కడి (ఇరాన్) రాడార్ వ్యవస్థలపై దాడులు చేశాం” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 

అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ప్రధానమంత్రి నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం, తదుపరి దాడులకు దూరంగా ఉన్నామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇజ్రాయెల్‌ను ట్రంప్ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాడులకు దూరంగా ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది.

 

“తమ యుద్ధ లక్ష్యాలన్నింటినీ సాధించినందుకు ఇజ్రాయెల్‌ను ట్రంప్ ప్రశంసించారు. అంతేకాకుండా, కాల్పుల విరమణ ఒప్పందం స్థిరంగా కొనసాగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు” అని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. అయితే, తొలుత తాము దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.

 

ఇరాన్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

 

ఇరాన్‌లో పాలన మార్పును తాము కోరుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే, అది తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ది హేగ్‌లో జరగనున్న నాటో సదస్సుకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండటానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కూడా తనతో మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *