మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పురస్కారం.. ఇది 25వ అంతర్జాతీయ గౌరవం..

Spread the love

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఖాతాలో మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని చేర్చుకున్నారు. కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’ను ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. శుక్రవారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టీన్ కంగాలూ ఈ అవార్డును మోదీకి అందజేశారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ నాయకుడు ప్రధాని మోదీ కావడం విశేషం.

 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “నాకు ఈ అత్యున్నత జాతీయ గౌరవాన్ని అందించినందుకు మీకు, మీ ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అవార్డు మన రెండు దేశాల మధ్య ఉన్న శాశ్వతమైన, బలమైన స్నేహానికి చిహ్నం. 140 కోట్ల భారతీయుల తరఫున ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నాను” అని తెలిపారు. ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వం, ప్రవాస భారతీయులతో ఆయనకున్న బలమైన సంబంధాలు, కోవిడ్-19 మహమ్మారి సమయంలో అందించిన మానవతా సహాయానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందిస్తున్నట్లు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా పెర్సాద్ బిస్సెసార్ పేర్కొన్నారు.

 

ప్రధాని మోదీకి లభించిన 25వ అంతర్జాతీయ పురస్కారం ఇది. ట్రినిడాడ్ పర్యటనకు ముందు ఘనాలో ఆ దేశ జాతీయ పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ను ఆయన అందుకున్నారు. ఇటీవలి కాలంలో సైప్రస్, శ్రీలంక, మారిషస్ వంటి దేశాలు కూడా తమ అత్యున్నత పౌర పురస్కారాలతో ప్రధాని మోదీని సత్కరించాయి. ఈ వరుస పురస్కారాలు ప్రపంచ వేదికపై ప్రధాని మోదీకి, భారతదేశానికి పెరుగుతున్న ప్రాధాన్యతను సూచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *