హంద్రీనీవా ఫేజ్-1 కాలువల పనులు పూర్తి..! సీమ జిల్లాలు సస్యశ్యామలం..

Spread the love

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నారు. తాజాగా రాయలసీమకు జల సిరులు తీసుకొచ్చింది ప్రభుత్వం. హంద్రీనీవా ఫేజ్-1 కాలువల పనులు పూర్తి అయ్యాయి. దీంతో సీమ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. పూర్తయిన హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు.

 

ఈనెల 17న నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద నీటిని విడుదల చేస్తారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఈ కాలువ విస్తరణ పనుల లక్ష్యాన్ని పూర్తి చేసింది. 696 కోట్ల రూపాయలతో చేపట్టిన విస్తరణ పనులు కాలువ ప్రవాహ సామర్ధ్యం 3850 క్యూసెక్కులకు పెరిగింది.

 

సీమకు తాగు, సాగు నీరు ఇవ్వాలన్న సంకల్పంతో టార్గెట్ పెట్టి ఫేజ్-1, ఫేజ్-2 కాలువ పనులను సీఎం చంద్రబాబు పరుగులు పెట్టించారు. కాలువ విస్తరణ పనులతో అదనంగా 1600 క్యూసెక్కుల నీటిని తరలించే అవకాశం వచ్చింది. తద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీరుతోపాటు 33 లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చేలా పనులు పూర్తి చేసింది.

 

మల్యాల నుంచి జీడిపల్లి వరకు 216 కిలోమీటర్ల మేరా హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు పూర్తి అయ్యాయి. దీంతో జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజులదిన్నెతోపాటు సీమ జిల్లాల్లో చెరువులను నీటితో నింపనున్నారు. దీనివల్ల సీమలో భూగర్భజలాలు గణనీయంగా పెరగనున్నాయి.

 

గతంలో హంద్రీనీవా ఫేజ్-1 కాలువ సామర్ధ్యం 2,200 క్యూసెక్కులు మాత్రమే. వరద సమయంలో కేవలం 40 టీఎంసీల నీటిని ఒకటి లేదా రెండసార్లు వినియోగించారు. ప్రస్తుతం కాలువల సామర్ధ్యం 3,850 క్యూసెక్కులకు పెరిగింది. దీనివల్ల 40 టీఎంసీల వరద జలాలను రాయలసీమ జిల్లాలకు వినియోగించుకునే ఛాన్స్ లభించింది.

 

నెలకు దాదాపు 4 టీఎంసీల చొప్పున నాలుగు నెలల వరదల సమయంలో అదనంగా 17 టీఎంసీల వరకు నీటిని తీసుకోవచ్చు. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు 40 టీఎంసీల నీరు రానుంది. దీనిద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల తాగు, సాగునీటి కష్టాలను తీరనుంది.

 

ఫేజ్-1తో నంద్యాల జిల్లాలో-2906 ఎకరాలు, కర్నూలు జిల్లాలో-77,094 ఎకరాలు, అనంతపురం జిల్లాలో-1,18,000 ఎకరాల ఆయకట్టుకు నీరు రానుంది. ఫేజ్-2 ద్వారా అనంతపురం జిల్లాలో 2 లక్షల పైచిలుకు ఎకరాలు అందనుంది. అలాగే కడప జిల్లా- 37 వేల ఎకరాలు, చిత్తూరు జిల్లాలో లక్షన్నర మేరా ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది.

 

హంద్రీనీవా ద్వారా 6 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందనుంది. దీనివల్ల 33 లక్షల మందికి తాగునీరు అందించవచ్చు. 2014-19 మధ్యకాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం హంద్రీనీవా కాలువల విస్తరణ పనుల్ని 47 శాతం పూర్తి చేసింది. అయితే 2019-24 వరకు ఆ పనులపై వైసీపీ ప్రభుత్వం చూడలేదు.

 

మళ్లీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ పనులను పరుగులు పెట్టించింది. 2025 ఏప్రిల్‌లో చేపట్టిన విస్తరణ పనులను కేవలం వంద రోజుల్లో పూర్తి చేసింది. ఫేజ్-2 పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేయనుంది. దీనిద్వారా పుంగనూరు, కుప్పంలో చివరి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *