కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ, వారణాసి, ముంబై.. ఇలా ఎన్నో చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి: జేపీ నడ్డా..

Spread the love

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో ఢిల్లీ, వారణాసి, ముంబై వంటి నగరాలలో బాంబు పేలుళ్లు సంభవించాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాజ్యసభలో జరుగుతున్న ‘ఆపరేషన్ సిందూర్’ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూపీఏ హయాంలో బాంబు పేలుళ్లు జరగని నగరమే లేదని పేర్కొన్నారు. వారి పాలనలో ఉగ్రవాదాన్ని చూసీచూడనట్లు వ్యవహరించారని ఆరోపించారు.

 

పహల్గామ్ దాడి, తదనంతర ఆపరేషన్ సిందూర్‌పై ప్రశ్నిస్తున్నవారు గతంలోని తమ పాలనను గుర్తుకు తెచ్చుకోవాలని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అప్పట్లో పేలుళ్లు జరగని నగరమంటూ ఏదీ లేదని అన్నారు. వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు.

 

ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మనపై బుల్లెట్లు పేల్చిన వారికి కాంగ్రెస్ బిర్యానీ పెట్టిందని వ్యంగ్యంగా అన్నారు. ఉగ్ర దాడులు చేసిన వారితో వాణిజ్య సంబంధాలు పెంచుకున్నారని ఆరోపించారు. పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేతను కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోయిందని విమర్శించారు. దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *