మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఎప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తి. హు అంటే మంత్రి పదవి.. హా మంత్రి పదవి గురించే ఎప్పటికీ ఆయన లొల్లి.. పదవి కోసం ఏదేదో తన నోటికి వచ్చింది మాట్లాడుతుంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి గెలిచిన విషయం తెలిసిందే. అయితే.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయమని పార్టీ హైకమాండ్ ఆయనను కోరింది. కానీ రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజల కోసం మునుగోడులోనే పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఆయన తరచూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక్కటి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను ఒకవేళ ఎల్బీనగర్ నుంచి పోటీచేసి ఉంటే……
ఎల్బీనగర్ నుంచి పోటీ చేసుంటే.. తనకు మంత్రి పదవి దక్కేదని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడు ప్రజల కోసం మంత్రి పదవి వదులుకున్నానని చెప్పారు. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. నా కన్నా చిన్న వయస్సు వారికి పదవులు ఇచ్చారిన ఆయన తెలిపారు. ‘మీరు ఎంపీ గెలిపించుకోమంటే గెలిపించా.. నేను ఎవరి కాళ్లు మొక్కి పదవి తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. మనసు దిగజార్చుకొని బతకడం నాకు తెలియదు’ అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలను తప్పుబడుతూ…
కొన్ని రోజుల క్రితం కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొంత చర్చనీయాంశంగా మారాయి. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఆశించడం, పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన వైఖరి ఏమాత్రం బాగోలేదని కొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.