బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ వైపా అనేది కాదని… ప్రస్తుతం తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని… వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకునే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. తనకు 73 సంవత్సరాలు వచ్చాయని… ఈ వయసులో ఏవైపూ చూడాల్సిన అవసరం లేదని అన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయ్యానని… ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. ఆ తర్వాత రాజకీయం వద్దనుకుంటున్నానని… ప్రజలకు సేవ చేస్తూ కాలేజీలు, యూనివర్శిటీలు నడిపిద్దామనుకుంటున్నానని తెలిపారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.