చంద్రబాబు, కేసీఆర్‌కు CM రేవంత్ కీలక విజ్ఞప్తి..

Spread the love

ఇండియా కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీఏ కూటమి నాశనం చేస్తోందని సీఎం అన్నారు.

 

జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకుందాం..

 

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రకటించడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గౌరవాన్ని పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓటు చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎన్డీఏ కూటమి ఒకవైపు.. మహాత్ముడి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతున్న ఇండియా కూటమి మరోవైపు ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణమని చెప్పారు. ఆయన్ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ తెలుగువాడిపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 

తెలుగు వాళ్లు ఏకం కావాల్సిన సందర్భం ఇది..

 

పీవీ నర్సింహారావు తరువాత ఒక తెలుగువాడిని ఆ స్థాయిలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా తెలుగు వాళ్లు ఏకం కావాల్సిన సందర్భం వచ్చిందని చెప్పారు. తెలుగువాడికి దక్కిన గౌరవం ఉపరాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన అని అన్నారు. ఉభయ రాష్ట్రాల్లోని అన్ని పార్టీలకు సీఎం విజ్ఞప్తి చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిపించాల్సిన బాధ్యత తెలుగువారిపై ఉందని పేర్కొన్నారు.

 

చంద్రబాబు, కేసీఆర్, పవన్ కల్యాణ్‌లు మద్ధతు ఇవ్వండి..

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కమ్యూనిస్ట్ సోదరులు, ఉభయ రాష్ట్రాల బీజేపీ ఎంపీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం మనందరికి ఉందని అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు.. ఆయన ఇండియా కూటమి ప్రతిపాదించిన న్యాయనిపుణుడు అని తెలిపారు.

 

రాజకీయ పార్టీలు విజ్ఞత ప్రదర్శించాలి..

 

రంగారెడ్డి జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని అన్నారు. ఆయన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ అని చెప్పారు. 1991 లో ప్రధాని రేసులో ఉన్న పీవీ నరసింహారావు నంద్యాల ఎంపీగా పోటీ చేసినపుడు.. ఆనాడు ఎన్టీఆర్ ఆయనపై పోటీ పెట్టకుండా మద్దతు పలికారని గుర్తుచేశారు. ఆ సమయంలో రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారని చెప్పారు. ఈనాడు ఒక తెలుగు వాడు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు విజ్ఞత ప్రదర్శించాలని అన్నారు. మనమంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని సీఎం రేవంత్ రెడ్డి కీలక నేతలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *