పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తలనొప్పిగా మారిందా..? మరో ఎమ్మెల్యేపై ఫైర్..!

Spread the love

పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తలనొప్పిగా మారిందా? ఎమ్మెల్యేలు మారడం లేదా? తాము సేవకులం అనే విషయాన్ని మరిచిపోతున్నారా? పార్టీని డ్యామేజ్ చేస్తున్నారా? ట్రాక్ తప్పిన ఎమ్మెల్యేలపై కొరడా ఝులిపించాల్సిన సమయం ఆసన్నమైందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత అధికార పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు విశ్వరూపం బయటపడుతున్నాయి. మొన్న గుంటూరు ఎమ్మెల్యే నజీర్, ఆ తర్వాత అనంతపురం వెంకటేశ్వరావు, ఆముదాలవలస కూన రవికుమార్ వంతైంది. తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వార్తల్లోకి వచ్చారు.

 

ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఫారెస్టు సిబ్బందిపై దాడి చేసిన దృశ్యాలు వెలుగులోకి రాగానే సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మొత్తం వివాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు.

 

ఇదిలా ఉండగా ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్ట అయ్యారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ప్రమేయంపై విచారించిన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులు తేల్చిచెప్పారు.

 

ప్రజా జీవితంలో ఉన్నవారు ముందుగా తమను తాము నియంత్రించుకోవాలన్నారు. ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

 

అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి అటవీశాఖ ఉద్యోగులపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆయన అనుచరులు దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి 10 గంటల సమయంలో శిఖరం చెక్‌పోస్ట్‌ దగ్గర వాహనాలను సిబ్బంది తనిఖీ చేసి పంపిస్తారు.

 

అదే సమయంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వాహనాన్ని పంపకుండా అలాగే ఉంచారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే బుడ్డా అటవీశాఖ ఉద్యోగుల వాహనం వద్దకు వెళ్లారు. మార్కాపురం డివిజన్‌ డిప్యూటీ రేంజి అధికారి రామ్‌నాయక్, ఇన్‌ఛార్జి సెక్షన్‌ అధికారి మోహన్‌కుమార్, అటవీ బీట్‌ అధికారి గురవయ్య, డ్రైవర్‌ షేక్‌ కరీముల్లాలను బయటకు పిలిచారు.

 

వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, డ్రైవర్‌ కరీముల్లా చెంప చెళ్లుమనిపించారు. అసభ్య పదజాలంతో వారిని దూషించారు. అటవీశాఖ సిబ్బందినీ జీపులో ఎక్కించి ఆ వాహనాన్ని డ్రైవ్‌ చేసుకుంటూ అర్ధరాత్రి రెండు గంటల వరకు తిప్పుతూ వారిని కొడుతూనే ఉన్నారు. దారిలో ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరు ఉద్యోగులను కొట్టినట్టు తెలుస్తోంది.

 

ఈ విధంగా చేయడం సరైనది కాదని ఓ ఉద్యోగి చెప్పినా వినిపించుకోలేదు. వారి నుంచి సెల్‌ఫోన్లు, పర్సులు, నగదు లాక్కున్నారు. వారందరినీ ఓ కాటేజీకి తీసుకెళ్లి బంధించి అర్థరాత్రి రెండు గంటల సమయంలో విడిచిపెట్టారు. తమపై దాడి జరిగిందని అటవీ ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీశైలం పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేయడం, కేసు నమోదు అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *